-
ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
-
తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలలు
-
కేపీఎంజీ అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేసిన అధ్యయన నివేదికలను పరిశీలించిన ప్రత్యేక కమిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్యను అభివృద్ధి చేయడంలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో మొత్తం 10 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, నిర్వహణను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది.వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలలకు టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించాలని స్పష్టంగా పేర్కొంది. మిగిలిన పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కళాశాలల విషయంలోనూ త్వరలో చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పీపీపీ విధానం ద్వారా నిధుల సమీకరణ వేగవంతం అవుతుందని, ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. కేపీఎంజీ అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ నాలుగు కళాశాలల అభివృద్ధికి సంబంధించి సమర్పించిన నివేదికలను పరిశీలించిన ప్రత్యేక కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. నిర్మాణానికి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య సేవలు – మౌలిక సదుపాయాల సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల వైద్య విద్యావకాశాలు విస్తరించడమే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడతాయి.
Read also : KumariAunty : లడ్డూ వేలంలో కుమారీ ఆంటీ-15 ఏళ్ల కల నెరవేరింది అంటూ భావోద్వేగ పోస్ట్
